తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారిపై కొత్త ఆంక్షలు!

  • కేవలం వాడపల్లి మీదుగానే ఎంట్రీ
  • సాగర్ నుంచి మాచర్లకు అనుమతి నిరాకరణ
  • ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకూ మాత్రమే
ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లే వాహనాలను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై తమకు ఆదేశాలు అందాయని, రాత్రి 7 గంటలలోపు మాత్రమే ఆయా వాహనాలు వాడపల్లి వద్ద సరిహద్దులను దాటాల్సి వుంటుందని నల్గొండ ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. అది కూడా పాస్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. జిల్లా మీదుగా మాచర్ల వైపునకు వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదని వెల్లడించిన ఆయన, ఏ వాహనమైనా వాడపల్లి మీదుగానే వెళ్లాల్సి వుంటుందని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ వద్ద చెక్ పోస్టు మూతబడివుంటుందని, కేవలం నిత్యావసర, అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని అన్నారు. ప్రజలు ఈ ఆంక్షలను గమనించాలని సూచించారు.

కాగా, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్లేవారిని అక్కడి అధికారులు 14 రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉంచుతున్నారు. వీరి ఆరోగ్యాన్ని నిత్యమూ గ్రామ, వార్డు వలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు సమీక్షిస్తుంటారు. ఇక ఇల్లు దాటి బయటకు వచ్చినట్టు తెలిస్తే, వారిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్ కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. వారిపై పోలీసు కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి.

Andhra Pradesh
Telangana
Travellers

More Telugu News